రాజా సింగ్కు ఎదురుదెబ్బ: పీడీయాక్టును సమర్థించిన అడ్వైజరీ బోర్డు
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు ఎదురుదెబ్బ తగిలింది. రాజా సింగ్పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. తనపై అక్రమంగా మోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజా సింగ్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన ఎమ్మెల్యే రాజా సింగ్.. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్టు ప్రయోగించారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.
రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యవహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని పోలీసులు వివరించారు. గతంలో అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివారలను కూడా బోర్డు ముందుంచారు.
ఇరువర్గాల వాదనలు విన్న బోర్డు.. పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని అడ్వైజరీ బోర్డు సమర్థించింది. దీనిపై రాజా సింగ్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
కాగా, ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రాజా సింగ్ పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజా సింగ్ పై రౌడీ షీట్ తెరిచారు.
రాజా సింగ్ తరచూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఘర్షణలు చోటు చేసుకునేలా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల పేర్కొన్నారు. ఓ వర్గాన్ని కించపరిచేలా పెట్టిన వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు రాజా సింగ్ పై 101 క్రిమినల్ కేసులు, 18 కమ్యూనల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.