తెలంగాణాలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న బీజేపీ ''గేమ్ ప్లాన్??''
కమలం దోసిట్లోకి తెలంగాణను గుప్పిట పట్టాలని చూస్తోన్న భారతీయ జనతాపార్టీ నేతలు తమ వ్యూహాలకు పదును పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి అధికారం కైవసం చేసుకోవాలంటే అందుకు తగ్గ ప్రణాళికనే అమలు చేయబోతున్నారు. హిందుత్వ కార్డు అయితేనే ఎన్నికల్లో తమను గట్టెక్కించగలదని భావిస్తున్నారు. ఈ కార్డుద్వారా అయితేనే రాష్ట్రంలో వేగంగా విస్తరించగమని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.
హైదరాబాద్ ను భాగ్యనగర్య గా మారుస్తాం..
హిందుత్వం విషయంలో దూకుడుగా ఉండే బండి సంజయ్కు పార్టీ బాధ్యతలు అప్పగించడంద్వారా ఇప్పటికే ఆ పార్టీ తమ ఉద్దేశమేంటనేది స్పష్టంగా చెప్పేసింది. హైదరాబాద్పేరును భాగ్యనగర్గా మారుస్తామని చెప్పడంతోపాటు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం అంశాన్ని రాబోయే ఎన్నికల్లో చర్చకు పెట్టడానికి బీజేపీ ప్రణాళికలు రచించుకుంటోంది.
ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని ముందు నుంచీ బీజేపీ ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. బండి ఇప్పటికే కేసీఆర్ ను ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీగా అభివర్ణించారు. రజాకార్ల పార్టీతో కేసీఆర్కు సంబంధాలున్నాయంటూ కేసీఆర్ను హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేస్తోంది. ఈ అంశం ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లగలుగుతుందనేదానిపై బీజేపీ విజయావకాశాలు ఆధారపడివున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఒవైసీ చేతిలో కేసీఆర్ స్టీరింగ్
ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా సైతం ఓవైసీ చేతిలో కేసీఆర్ సర్కారు స్టీరింగ్ ఉందంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉండే యాంటీ ఎంఐఎం సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బలమైన హిందుత్వ ఓటు బ్యాంక్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవడంద్వారా రెండువిధాలా లాభమనే యోచన చేస్తోంది.
ఉత్తర భారతీయుల అండ..
హైదరాబాద్లో నివసించే ఉత్తర భారతీయులు బీజేపీకి అండగా నిలబడే అవకాశాలున్నాయి. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వీరి ఓటింగ్ శాతం ఎక్కువ. వీరితో పాటు బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల్లో మంచిపట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉండే బీసీ వర్గాన్ని బండి సంజయ్కు పార్టీ పగ్గాలు అప్పగించడంద్వారా తమవైపు తిప్పుకున్నట్లేనని పార్టీ భావిస్తోంది.
ఓబీసీ వర్గానికి చెందిన మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీంతో ఆ పార్టీకి తెలంగాణా బీసీల్లో పట్టుదొరికే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీలంతా గుంపగుత్తగా ఒకేపార్టీకి ఓటువేసిన దాఖలాలు లేవు. మరి బీజేపీ వీరిని తమవైపు ఎలా తిప్పుకుంటుందనేదానిపైనే ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడివున్నాయి.