డబ్బులను ఖాతాల్లో వేయాలి: 'చీప్ లిక్కర్పై కేసీఆర్ను అసెంబ్లీలో నిలదీస్తాం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నీలదీస్తామని బీజేపీ శాసనసభపక్ష నేత లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం అంథోలు గెస్ట్హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు, పథకాలు ప్రవేశపెడుతూ వాటిని ప్రభుత్వం సమర్ధించుకుంటుందన్నారు. చౌకమద్యం పేరుతో సారాయిని ప్రవేశపెట్టడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని, ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టే చీప్ లిక్కర్పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదని, రాష్ట్రంలో ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో ఆశించి అధికారాన్ని అప్పగిస్తే ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.
త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకూ ఒక్క ఇళ్లు కూడా కట్టించకపోగా, పాత ఇళ్ల బిల్లులను సైతం ఇవ్వడం లేదన్నారు. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ప్రభుత్వం విడుదల చేసిన 25 శాతం డబ్బులు వడ్డీ క్రిందకే పోతున్నాయన్నారు.
మొత్తం ఒకేసారి రైతులకు రుణమాఫీ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.