ఇది దారుణం.!అత్యంత హేయం.!పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి.!ముక్త కంఠంతో నినదించిన కాంగ్రెస్.!
హైదరాబాద్ : ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించాలని తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల అసమర్థ విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర 100 రూపాయలకు చేరిందని టీపీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది నుండి 25 రూపాయలు పెరిగిందని, దీనికి కారణం మోడీ ప్రభుత్వమేనని, అంతర్జీతీయ చమురు ధరలు తగ్గుతుంటే ఇక్కడ ఎక్సైజ్ సుంకం భారీగా పెరిగిందని, ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుంది కేంద్ర బీజేపి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పేద సామాన్య మద్య తరగతి ప్రజలు భరించలేని స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం పై కాంగ్రెస్ ఆందోళన చేస్తుందని, వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసారు.
Recommended Video
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో ఎందుకు చేర్చడం లేదు.. సూటిగా ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి
2014 కాంగ్రెస్ పాలనలో పెట్రోల్,డీజిల్,గ్యాస్ అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం 75 వేల కోట్లు ఉంటే, నేడు మోడీ పాలనలో 3.34 లక్షల కోట్లు పెరిగిందని, కాంగ్రెస్ పాలనలో ముడిచమురు ధర 107 డాలర్లు ఉంటే డీజిల్ లీటర్ 54 రూపాయలకే విక్రయించామని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పెట్రో,డీజిల్ ధరలు పేదోళ్లకు అందుబాటులో ఉంచాంమని, మన్కీ బాత్లో మాట్లాడే మోడీకి సామాన్యుల కష్టాలు ఏం తెలుసని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానమంటూ మాట్లాడే బిజెపి నాయకులు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో ఎందుకు చేర్చడం లేదని నిలదీసారు.పెట్రోల్ను జీఎస్టీలో చేర్చితే 28 శాతం మాత్రమే పన్ను భరించాల్సి ఉంటుందని, ఫలితంగా లీటర్ పెట్రోల్ 75 రూపాయలకే వస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు.పెట్రో ధరల పెంపుపై వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి.
పెట్రో ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయి.. ఇప్పుడెందుకు పెంచారన్న జగ్గారెడ్డి.
యుపిఎ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రజలపై ఎలాంటి భారం మోపలేదని, డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు యూపీఏ హయాంలో అదుపులో ఉన్నాయని, మోడీ ఈ ఏడేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. మోడీ పెట్రోల్, డీజిల్ ధరలను సెంచరీ దాటించారని, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఇండియా లో పెట్రోల్, డీజిల్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నారని జగ్గారెడ్డి నిలదీసారు.టీఆరెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య అంతర్గత అవగాహన ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రావు ప్రశ్నించలేక పోతున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
మోడీది దోపిడీ మనస్తత్వం.. అందుకే పెట్రో ధరలను పెంచుతున్నారన్న దాసోజు శ్రవణ్..
గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయిలు దండుకున్నారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని, దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ ఈ దోపిడీ మనస్తత్వాన్ని వీడి, కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని, వెంటనే పెట్రోల్ డీజల్ గ్యాస్ ధరలు తగ్గించాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ లూటీకి హద్దులేకుండా పోతోందని, ప్రజలని దోచుకుని తినేయాలనే బీజేపి ఆలోచన దుర్మార్గమని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ, బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుందని విమర్శించారు శ్రవణ్. ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన తెలిపారు దాసోజు శ్రవణ్.
ప్రజల రక్తన్ని జలగల్లా పిల్చేస్తున్న మోడీ పాలన.. పెట్రో ధరలు తగ్గించకపోతే ఉద్యమిస్తామన్న కోమటిరెడ్డి..
ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలను లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండాగా మారిందని, క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారని మండిపడ్డారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోందని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. గత ఏడేళ్ళుగా పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయలను దండుకున్నారని, గత రెండు నెలల్లోనే పెట్రోల్ డీజల్ ధరలు 25 సార్లు పెంచడం ఎంతవరకు సంమంజసమని కోమటిరెడ్డి వెంకట రెడ్డి నిలదీసారు. ప్రజల నుండి ఈ రకంగా ధనాన్ని పిండేస్తున్నా దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తోందని కోమటిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్ ధర తగ్గాలి.. కాని ధనదాహంతో మోదీ ధరలు పెంచుతున్నారన్న భట్టి..
ఖమ్మం పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర బీజేపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీ సర్కార్ కేవలం వ్యాపార మనస్తత్వంతో నడుస్తుందని, క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు సహజంగానే పెట్రోల్ ధర తగ్గాలి కానీ పెట్రోల్ ధర ఆకాశానికి తాకుతుందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిందని భట్టి మండిపడ్డారు. బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కూడా భారత్ కంటే పెట్రోల్, డీజల్ ధరలు తక్కువ వున్నాయని భట్టి గుర్తు చేసారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చుతానని ప్రగల్భాలు పలికిన మోడీ, దేశాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారని, ఈ అసమర్ధ పాలన, దోపిడీని ఆపాలంటే మోడీ సర్కార్ ని గద్దె దించాల్సిన అవసరం వుందని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.