తెలంగాణలో కోవిడ్-19: హాట్స్పాట్లు, రెడ్జోన్లు.. లాక్డౌన్ విశేషాల పూర్తి సమాచారం..!
హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మనదేశంలో కూడా కరోనా కాటేస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పడటం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే ఇక్కడ కూడా కేసులు అధికంగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ మహమ్మారిని నియంత్రించించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ 20వ తేదీన లాక్డౌన్ నుంచి కొన్నిటికి మినహాయింపు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక తెలంగాణలో హాట్స్పాట్లు ఎక్కడున్నాయి... రెడ్ జోన్ల సంగతేంటి.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలపై సమగ్ర కథనం.
హాట్స్పాట్ క్లస్టర్లు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, గద్వాల, మల్కాజ్గిరి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. నల్గొండ జిల్లాను రెడ్ జోన్ (హాట్స్పాట్ క్లస్టర్)గా గుర్తించింది. సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఆరెంజ్ జోన్లు(నాన్-హాట్ స్పాట్)గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 292 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు.
కోవిడ్-19 చికిత్స కోసం హాస్పిటల్స్ ఏర్పాటు
తెలంగాణలో మొత్తం 8 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన కరోనా ఆసుపత్రిగా సేవలందిస్తోంది. గచ్చిబౌలి ఆసుపత్రి, కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రి, బేగంపేట్లో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్ ప్రాంతంలోని గవర్నమెంట్ నిజామీయా జనర్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద టీచింగ్ ఆసుపత్రి, హైదరాబాద్లోని రామాంతపూర్ ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్క గచ్చిబౌలిలోనే దాదాపు 1500 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష జరుపుతూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వలస కార్మికులకు కూడా రేషన్, నగదు
వలస కార్మికులకు సైతం ఒక్కొక్కరికి రూ.1500తో పాటు రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.పలు చోట్ల షెల్టర్స్ ఏర్పాటు చేసి నిరాశ్రయులకు,యాచకులకు ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సహకం కింద ఇటీవలే వైద్యులకు గ్రాస్ శాలరీలో 10శాతం,పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7500,గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000 ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సహా అధికారులు ప్రజల నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో సడలింపులు లేవు
కేంద్రం ప్రకటన కంటే ముందే తెలంగాణలో కరోనా లాక్ డౌన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30వరకు పొడగించారు. ఆ తర్వాత కేంద్రం మే 3వరకు పొడిగించగా తాజాగా కేసీఆర్ లాక్డౌన్ను 7వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్రం ఇచ్చే సడలింపుల పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆదివారం(ఏప్రిల్ 19)న నిర్ణయం తీసుకున్నారు.సంపూర్ణ లాక్ డౌన్ను కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి సడలింపులు ఇవ్వరాదని నిర్ణయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాలకు కరోనా నియంత్రణ చర్యల కోసం రూ.308 కోట్లు విడుదల చేశారు. జనాభాతో సంబంధం లేకుండా అవసరాన్ని బట్టీ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షలు నుంచి రూ.7 లక్షల వరకు మంజూరు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణ చర్యలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. ఇక ఈ కథనం ప్రచురించే సమయానికి తెలంగాణ రాష్టంలో నమోదైన పాజిటివ్ కేసులు 858గా ఉండగా మరణాల సంఖ్య 21గా ఉంది. ఇక కోలుకున్నవారి సంఖ్య 186గా ఉంది.
ఇక ఏఏ రాష్ట్రంలో ఎన్ని కేసులున్నాయి, ఎన్ని మరణాలు నమోదయ్యాయి అనే సమగ్ర వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి: