లీకేజీలో కెసిఆర్ ఫ్యామిలీ: విరుచుకుపడ్డ డీకే అరుణ, హరీశ్పైనా
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ మరోసారి టిఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్కు వెళ్లకుండా ప్రతిపక్షాలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు వెళ్తే మల్లన్నసాగర్కు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఆరోపించారు.
ఎన్ని రోజులు అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము మాత్రం అక్కడికి వెళ్లే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పారు. రైతులు భూములివ్వడానికి అంగీకరించారని మంత్రి హరీశ్రావు చెబుతున్నదంతా బూటకమేనని అన్నారు. మల్లన్నసాగర్కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీలను అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
మల్లన్నసాగర్ పాకిస్థాన్లో ఉందా? ప్రతిపక్ష నేతలు టెర్రరిస్టుల్లా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు. తమకేమో 144 సెక్షన్ అంటున్న పోలీసులు.. టిఆర్ఎస్ నాయకులకు ఎలా ర్యాలీలకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసిత రైతుల ఉసురు కేసీఆర్కు తగులుతుందన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటని అరుణ్ విమర్శించారు.
అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యపై చర్య తీసుకున్న కెసిఆర్.. ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే లీకేజీ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆవేదన కేసీఆర్కు కనబడటం లేదా? అని డీకే అరుణ నిలదీశారు. కెసిఆర్ పాలనలో రాస్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. వీసీల నియామకంలో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కేసీఆర్కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.