హైదరాబాదులో డ్రగ్స్ కలకలం: శృంగార వాంఛను పెంచే మందుల కంపెనీ గుట్టు రట్టు
రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగు చూసింది. అయితే ఈసారి తీగ బెంగళూరులో కదిలితే డొంక హైదరాబాదులో బయటపడింది. బెంగళూరులోని కంగేరీ ప్రాంతంలో ఇద్దరి యువకుల నుంచి డ్రగ్స్ పట్టుకున్నారు కర్నాటక పోలీసులు. నిందితులను విచారణ చేయగా దిమ్మ తిరిగే విషయాలు వెలుగు చూశాయి. ఒక్క బెంగళూరులోనే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెన్నైలలో ఈ డ్రగ్స్ ర్యాకెట్ కోరలు చాచినట్లు తెలుస్తోంది.
నాచారంలోని ఇంతం ల్యాబ్లో డ్రగ్స్ తయారు
బెంగళూరులో పట్టుబడ్డ నిందితులు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని నాచారం కేంద్రంగా ఈ డ్రగ్స్ తయారవుతున్నాయి. నాచారంలోని ఇంతం ల్యాబ్స్ కెటమైన్ అనే మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం గత ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరగుతోందని పోలీసులు తెలిపారు. బెంగళూరులో పట్టుబడిన ముఠా నుంచి కీలక సమాచారంను రాబట్టారు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు. వీరిచ్చిన సమాచారంతోనే నాచారంలోని ఇంతం ల్యాబ్పై సోదాలు చేశారు. అక్కడ కెటమైన్ అనే ఈ డ్రగ్ను తయారు చేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో ల్యాబ్ను సీజ్ చేసింది డ్రగ్స్ కంట్రోల్ బోర్డు.
మూతపడిన ల్యాబుల్లోనే తయారు అవుతున్న డ్రగ్స్
ఇక డ్రగ్స్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్న సమాచారం అందుకున్న అధికారులు గత నాలుగురోజులుగా దీనిపై వర్కౌట్ చేస్తున్నారు. ఈ నిందితులకు డ్రగ్ పెడ్లర్స్తో కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో మొత్తం 26 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు అధికారు. ఇదిలా ఉంటే హైదరాబాదు చుట్టుపక్కల పరిసరాల్లో చాలా మూతపడిన ల్యాబ్లు ఉండగా అందులోనే డ్రగ్స్ తయారు అవుతున్నట్లు తెలుస్తోంది.
మనిషిని మూడు గంటలపాటు మత్తులో దించగల కెటమైన్ డ్రగ్
కెటమైన్ అనే ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ను మహిళలకు విద్యార్థులకు ఇస్తున్నారు. ఒక్కసారి ఈ డ్రగ్ తీసుకుంటే దాదాపు నాలుగు గంటల పాటు మత్తులోనే జోగుతారని తెలుస్తోంది. ఈ మత్తుమందును మహిళలపై ప్రయోగించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడే అవకాశాలున్నాయని డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కెటమైన్ డ్రగ్లో సెక్స్ హార్మోన్లు పెంచే మరో డ్రగ్ను కలిపి తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ను పబ్బులు క్లబ్బులకు కూడా సరఫరా చేస్తున్నారని దీని వెనక పెద్ద మాఫియా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు.