'జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారు? పదివేల చీరలు ఎక్కడికిపోయాయి?'
'మనం చనిపోయినప్పుడు.. పోతే పోయిండులే అన్న రీతిలో కాకుండా.. అయ్యో.. అనిపించుకోవాలె' అని ఈటెల అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: తమిళనాడు సీఎం జయలలితపై తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా.. బ్లాక్ మనీ, మానవ విలువల వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. దీంతో జయలలిత జీవితాన్ని ఉదహరిస్తూ పోయేటప్పుడు ఎవరేమి తీసుకుపోలేరని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా ఓ కాలేజీ కార్యక్రమంలో తాను పాల్గొన్న విషయం గురించి చెబుతూ.. తన ప్రసంగం ముగిసిన తర్వాత కాలేజీ విద్యార్థులంతా ఆహా, ఓహా అన్నారని గుర్తు చేశారు. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకుపోలేమని, జయలలిత తన వెంట ఏం తీసుకెళ్లారని, ఆమె పది వేల చీరలు ఏమై పోయాయని ఆయన ప్రశ్నించారు.
'మనం చనిపోయినప్పుడు.. పోతే పోయిండులే అన్న రీతిలో కాకుండా.. అయ్యో.. అనిపించుకోవాలె' అని ఈటెల అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్మనని ఈటెల రాజేందర్ తెలిపారు. తనకు దేవుడిపై విశ్వాసం లేకున్నా రూ.5 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
పాత కరీంనగర్ జిల్లాలో రూ.15 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. సామూహిక వివాహాలు కూడా చేయిస్తున్నట్టు తెలియజేశారు.