అందరున్నా:ప్రత్యూషపై కోర్టు విచారం, మోడీ 'బేటీ బచావో', తండ్రి జీతం సగం
హైదరాబాద్: ప్రత్యూష సంరక్షణ బాధ్యతను తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. కోర్టు రమేష్ జీతం, ఆస్తి వివరాలను అడిగింది. ప్రత్యూష పెద్దమ్మ, పెదనానలతో న్యాయస్థానం డివిజన్ బెంచ్ మాట్లాడింది. ప్రత్యూష పినతల్లిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యూషకు తండ్రి వేతనంలో కొంత భాగం కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ప్రత్యూష సంరక్షణ బాధ్యత పైన దృష్టి సారించింది. ఆమె కోరుకున్న చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆమెను రెస్క్యూ హోంకు తరలింపుకు హైకోర్టు నిరాకరించింది.
ప్రత్యూషను సవతి తల్లి హింసిస్తుంటే బంధువులు, చుట్టుపక్కల వారు స్పందించక పోవడం దారుణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రత్యూష తండ్రి రమేష్ను, మేనమామ సాయి ప్రతాప్ను 20న హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం పథకం బేటీ బచావో బేటీ పడావో ఆమెకు వర్తించేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఇంత జరిగినా పశ్చాత్తాపం లేకపోవడంతో పిన్ని చాముండేశ్వరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయి నరకం నుండి బయటపడినా, ఆ అమ్మాయిని అక్కున చేర్చుకునే వారు ఏరని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యూష కన్న తండ్రి బతికే ఉన్నాడు. పెదనాన్న డిప్యూటి కలెక్టర్. మేనమామ లాయర్. ఇలా అందరు ఉన్నప్పటికీ ప్రత్యూష అనాథగా మిగిలి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె సంరక్షణకు ఎవరు ముందుకు రాలేదు.