ఐఫోన్ ఇవ్వలేదని, అమెరికాలో హైదరాబాద్వాసిని కాల్చి చంపారు
అమెరికాలో హైదరాబాదులోని కుషాయిగూడకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఐఫోన్ ఇవ్వలేదని దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు. ఉన్నత చదువుల కోసం కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లిన తమ కుమారుడికి ఇలా జరగడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాప్రాలోని సుబ్రహ్మణ్య కాలనీకి చెందిన ఆయిల్ల శ్రీహరి కుమారుడు ఆయిల్ల సాయికిరణ్ గౌడ్ (23) అట్లాంటా వర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు గత నెల 2న అమెరికా వెళ్లాడు. సాయికిరణ్ ఫ్లోరిడాలోని మియామి నగరంలో 11 మంది మిత్ర బృందంతో ఓ అపార్టుమెంటులో ఉంటున్నాడు.
శనివారం రాత్రి (అమెరికా సమయం) సాయికిరణ్ తాను ఉంటున్న అపార్టుమెంటు కింద నిల్చొని ఫోన్లో మరో రాష్ట్రంలో ఉన్న మిత్రుడు శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అతని వద్దకు వచ్చిన ముగ్గురు నల్ల జాతీయులు ఫోన్ కావాలని అడిగారు.
ఇటీవలే తాను కొనుగోలు చేసిన ఐఫోన్ ఇవ్వడానికి నిరాకరించిన సాయికిరణ్పై దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. తుపాకీ శబ్దం విన్న మిత్రులు కిందకు వెళ్లారు. అతను రక్తపు మడుగులో కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ఈ విషయాన్ని సాయికిరణ్ మిత్రులు హైదరాబాదులోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సాయికిరణ్ అపార్టుమెంటు కింద కారు పక్కన నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో అతడి మిత్రులు అపార్టుమెంటుపై నిల్చొని ఉన్నారు.
నల్ల జాతీయులు ఆయన వద్దకు వచ్చి మాట్లాడుతున్న విషయాన్ని మనోజ్ అనే స్నేహితుడు గమనించాడు. సాయికిరణ్ను దుండగులు సెల్ఫోన్ అడిగారని తాము కిందకుదిగేలోపే కాల్పులు జరిపి సెల్ఫోన్తో పరారైనట్లు మనోజ్. మృతుడి కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాడు.
సాయికిరణ్ నివాసం వద్ద స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మిత్రులు, బంధువులు, నేతలు వచ్చి అతని తండ్రిని పరామర్శించారు. హత్య విషయమై మిత్రులు, బంధువులు కుషాయగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నగరంలోని సుల్తాన్ బజార్కు చెందిన ఆయిల్ల శ్రీహరి వ్యాపారి.
అతని అమ్మమ్మ కాప్రాలో ఉండటంతో 40ఏళ్ల క్రితమే వచ్చి సుబ్రహ్మణ్యకాలనీలో స్థిరపడ్డాడు. అతనికి భార్య రూపాభవానీ, కుమారులు సాయికిరణ్, అవినాష్లు ఉన్నారు. సాయికిరణ్ చదువుల్లో ముందుడే వాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఘటన విషయాన్ని అమెరికన్ కాన్సుల్ దృష్టికి తీసుకువెళ్లామని కుషాయిగూడ సీఐ వెంకటరమణ తెలిపారు. సెల్ఫోన్ కావాలని గొడవ పడిన నల్ల జాతీయులకు దాన్ని ఇచ్చేసిఉంటే తన కుమారుడు దక్కేవాడని సాయికిరణ్ తండ్రి శ్రీహరి బోరున విలపించారు.
రెండు రోజుల క్రితమే రూ.60 వేలు పెట్టి ఐఫోన్ను కొనుగోలు చేశాడని కొత్త ఫోన్ తన కుమారుడి ప్రాణాల మీదకు తెచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. అమెరికాలో ఇలాంటి పరిస్థితి వూహించలేదని, లేకుంటే పంపేవాడినే కాదని రోదించాీరు. మృతి విషయం తెలిసిన తల్లి రూపాభవానీ కుప్పకూలారు.