పదవులు ముఖ్యం కాదు, కఠినంగా ఉంటాం: కేసీఆర్
హైదరాబాద్: జీవితంలో పదవులు ముఖ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు అన్నారు. కేసీఆర్ హోటల్ మారియట్లో జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొని, ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేసీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా మనమంతా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. శాంతిభద్రతలు లేకుంటే ఏమీ లేనట్టేనని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రజలకు మంచి పనులు చేస్తూ ముందుకు సాగుదామన్నారు. మంచి పని చేయడంలో ఉన్న సంతృప్తి ఎందులోను ఉండదన్నారు.
సేవ ద్వారా వచ్చే తృప్తి విలువ కట్టలేనిదన్నారు. ప్రభుత్వ ప్రథమ లక్ష్యం ప్రజల సంక్షేమమన్నారు. అన్నింటికి మించిన శక్తి ప్రజా శక్తి అన్నారు. ప్రజల్లో ఒకరిలా కలిసిపోయి ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. గతంలో తెలంగాణలో భయానక వాతావరణం ఉండేదన్నారు. సాయుధ పోరాటం, నక్సలిజం సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటుండేదని పేర్కొన్నారు.
ప్రజలు అధికారం కట్టబెట్టారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. సీఎంగా, మంత్రులుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఎందరో వచ్చారు పోయారని, ఎవరున్నా పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అనేక చర్చల అనంతరం మేనిఫెస్టోను రూపొందించామన్నారు. సమస్యల పరిష్కారం దిశగా వెళ్దామన్నారు.