జిహెచ్ఎంసి ఎన్నికలు: కెసిఆర్ డైరెక్షన్, కెటిఆర్ యాక్షన్
హైదరాబాద్: త్వరలో జరిగే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పకడ్బందీ వ్యూహరనచ చేసినట్లు తెలిస్తోంది. మేయర్ పీఠాన్ని ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా దక్కించుకునే వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 150 డివిజన్లలో కనీసం 80 డివిజన్లలో విజయం సాధించాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించే పెట్టే బాధ్యతను కెసిఆర్ తన తనయుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు అప్పగించినట్లు చెబుతున్నారు. అదే విధంగా మరో ఇద్దరు మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కూడా బాధ్యతలను పంచుకుంటారు. వ్యూహరచనలో భాగంగానే జిహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్లలోనూ పార్టీని బలోపేతం చేయడానికి కెటిఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం, ఇతర పార్టీలకు చెందిన నేతలను అధికార టిఆర్ ఎస్లోకి చేర్చుకోవటం లాంటి వ్యవహారాలను కెటిఆర్ చూసుకుంటున్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు వుంటుందని ప్రచారం సాగింది. అయితే, కెసిఆర్ మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.
అవసరమైతే మొత్తం 150 డివిజన్ల లోనూ అభ్యర్ధులను పోటీకి దింపటంలో భాగంగా అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే కెటిఆర్ కసరత్త్తు మొదలుపెట్టినట్లు తెలుస్తో ది. ఇందులో భాగ్గంగానే వివిధ వర్గాలతో కెటిఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికలకు ప్రధానంగా సీమాంధ్రుల ఓట్లపైనే అధికార పార్టీ దృష్టి పెట్టింది. సీమాంధ్రుల ఓట్లను దక్కించుకోవటంలో భాగంగా వారికి కూడా సుమారు 25 డివిజన్లలో టిక్కెట్లు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఈ కారణంగానే ప్రస్తుతానికి సీమాంధ్రులు ఎక్కువుగా నివసిస్తున్న డివిజన్లను గుర్తిస్తున్నారు. షాద్నగర్, శంషాబాద్, కొంపల్లె, నిజాంపేట, కుక్కట్పల్లి, నల్ల కుంట, బర్కత్పుర, పటాన్చెరువు, మలక్పేట, ఉప్పల్, దిల్సు ఖ్నగర్, ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్ తదితర ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువుగా ఉన్నట్లు పార్టీ నిర్వహించిన సర్వేలో తేలింది.
సీమాంధ్రుల ఓట్లను దక్కించుకోవటంలో కెటిఆర్తో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా క్రియాశీలకంగా వ్యవహరి స్తున్నారు. విజయరామారావు పార్టీలోకి వస్తే అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కెటిఆర్, తుమ్మల నాగేశ్వర రావు ఇప్పటికే సీమాంధ్రకు చెందిన ప్రముఖులతోనూ, వివిధ వర్గాలకు చెందినవారితోనూ మూడు దఫాలు సమావేశాలు కూడా జరిపారు.