కార్పోరేటర్ టిక్కెట్ కోసం మాగంటి గోపినాథ్ ఆఫీస్ వద్ద వ్యక్తి సూసైడ్యత్నం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జూబ్లీహిల్స్ శాసన సభ్యుడు మాగండి గోపినాథ్ కార్యాలయం వద్ద ఆదివారం నాడు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పేరు ముస్తఫా అని తెలుస్తోంది.
అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. త్వరలో జరిగి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు కార్పోరేటర్ టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దీనిపై మాగంటి గోపినాథ్ స్పందిస్తూ... ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని వివరణ ఇచ్చారు. అతను టిడిపికి చెందిన వ్యక్తి కాదన్నారు. కాగా, పదిహేను రోజుల క్రితమే అతను టిడిపిలో చేరుతానని ఆ పార్టీ నేతలను కలిసినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం సాయం లేనిదే అభివృద్ధి చెందదు: దత్తాత్రేయ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే దిశగా కృషి చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తాను ప్రధాని మోడీని తీసుకు వస్తానని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడ్డ జట్టులో తనతో పాటు ప్రధాని మోడీ, కేసీఆర్ అందరూ సభ్యులేనన్నారు. తదుపరి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అధిక నిధులు, కొత్త రైళ్లు వచ్చేందుకు తన వంతు కృషిని చేస్తానని, బడ్జెట్లో మూసీ నది సుందరీకరణకు నిధులు అందిస్తామన్నారు.
కేంద్రం సాయం లేనిదే అభివృద్ధి జరగదన్నారు. హైదరాబాదులోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చాయన్నారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపిస్తామన్నారు. గ్రేటర్లో బిజెపి - టిడిపి జెండా ఎగురుతుందన్నారు.