బీహార్లో 40 సీట్లకు పోటీ: అసదుద్దీన్, ఎన్డీఎ సీట్ల సర్దుబాటు
హైదరాబాద్: బీహార్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని మజ్లీస్ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 24 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. సీమాంచల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రాన్నికోరారు.
సీమాంచల్లో ఆర్టికల్ 371ను అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల ప్రీపోల్ సర్వేలు భిన్నంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంచల్ ప్రాంతంలో 70శాతం మంది దళితులు, ముస్లింలు ఉన్నారని తెలిపారు. దళితులు, ముస్లింల అభివృద్ధే తమ ధ్యేయమని అసదుగ్గీన్ స్పష్టం చేశారు.
బీహార్ రాష్ట్ర ఎంఐఎం విభాగం అధ్యక్షుడిగా అఖ్తర్ ఉల్ ఇమాన్ను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ అభివృద్ది మండలి ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పారు. సీమాంచల్లోని నాలుగు జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నామన్నారు.
ఇదిలావుంటే, బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 162, రాం విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి (ఎల్జెపి) 44 సీట్లకు పోటీ చేస్తాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పాశ్వాన్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన కుదిరినట్లు సమాచారం.
కాగా, ఎన్డిఎలో చేరిన జితన్ రామ్ మంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చో 15 సీట్లకు పోటీ చేస్తుంది. ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ 25 సీట్లలో తన అభ్యర్థులను నిలుపుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఐదు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్లో 243 శానససభా స్థానాలున్నాయి.