రెండు కళ్ల సిద్ధాంతం: అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అంటూ పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఇప్పుడు తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా ఆ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఓ బహిరంగ సభలో ప్రస్తావించారు. ఇంతకీ మంత్రి హరీశ్ రావు రెండుకళ్ల సిద్ధాంతం ఏంటో చూద్దాం.
సిద్ధిపేట, నారాయణ ఖేడ్ నాకు రెండు కళ్లు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఫిబ్రవరిలో జరిగే నారాయణ ఖేడ్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి తరపున మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు.
నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక అణచివేతకు, అభివృద్ధికి మధ్య పోరాటం అని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదని మంత్రి ఆరోపించారు. మూడు సంవత్సరాలలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్న సంజీవరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొనున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిష్టారెడ్డి విజయం సాధించారు. ఆయన గతేడాది గుండెపోటుతో మరణించారు. దీంతో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది.