తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు: పిడుగుపాటుకు ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు(సోమ, మంగళవారాలు) కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని తెలిపింది.
సోమవారం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీశ్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలో రెండు మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కుమురంభీం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి
కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఒక మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని కాగజ్నగర్ మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. అంకుశాపూర్ వద్ద పిడుగుపడి నానాజీ(40) అనే వ్యక్తి మృతి చెందారు. రాస్పల్లి గ్రామం వద్ద పిడుగుపాటుకు సుమన్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
మరో ప్రాంతమైన కౌటాల మండలం వైగామ్ వద్ద పిడుగుపడటంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్షం పడుతున్న సమయంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండకూడదని తెలిపారు.