అంబేడ్కర్ రోజును సెలవుగా భావించొద్దు: పరిపూర్ణానంద, కోర్టు తీర్పుపై..
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ యావత్ భారతీయులకు మహనీయుడని, ఆయన జయంతి రోజున ప్రభుత్వం ఇచ్చే సెలవును దేశ పౌరులు సెలవుగా భావించకుండా సేవాదినంగా భావించాలని పరిపూర్ణానంద స్వామి బుధవారం నాడు సూచించారు.
కులం, మతం, ప్రాంతం, వర్గం అనే తారతమ్యం లేకుండా భారతీయులు తలెత్తుకుని తిరిగేలా భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని జలవిహార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశం గర్వించదగ్గ ఆదర్శభావాలు కలిగిన అంబేద్కర్ను రాజకీయ నాయకులు ఓట్ల కోసం వాడుకుంటుండగా, సమాజంలోని మరికొందరేమో మతం, కులం, ప్రాంతం, వర్గం పేరుతో ఆయన ఆశయాలను నీరుగార్చుతున్నారని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానీయుల, మహాత్ముల జయంతి రోజు న సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అదే మహానీయులకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని యువత గ్రూపులుగా ఏర్పడి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, ఫలహారాలు అందించాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగంలో భారత్ మాతా కీ జై అని అనాలని లేదు, అలాగే అనొద్దని లేదన్నారు. అయితే కొంతమంది చట్టసభల్లో ఉన్న వ్యక్తులు ఇంటాంటి ప్రకటనలు చేయడం మానుకోవాలన్నారు. హిందూధర్మంలో లింగవివక్షకు ఎక్కడా స్థానం లేదని పరిపూర్ణానంద స్వామి తెలిపారు.
మహిళలు శనిసింగనాపూర్ ఆలయ ప్రవేశంపై కూడా స్పందించారు. హిందూ ధర్మంలో మొదటగా స్త్రీనే పూజిస్తారన్నారు.
తమకు కోర్టులంటే అత్యంత గౌరవం అని, అయితే దేవాలయాలకు సంబంధించి తీర్పులు వెనువెంటనే ఇవ్వకుండా దేవాలయాల ప్రవేశంపై వచ్చిన పిటీషన్లపై విచారణకు ప్రత్యేక ధర్మాసనంను ఏర్పాటు చేయించి విచారణ చేయిస్తే వాస్తవాలు, అందుకు సంబంధించిన మూలాలు, శాస్త్రీయ అంశాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు.