ఎడతెరపిలేని వాన: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దఅంబర్పేట, అనాజ్పూర్, అబ్దుల్లాపూర్మెట్, కూకట్పల్లి, మియాపూర్, లింగపల్లి, ఖైరతాబాద్, సోమాజీగూడ, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామవుతోంది.
కాగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్రలతో సోమవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్లో అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకునే ఏర్పాటు చేసుకుని వెంటనే స్పందించాలని ఆదేశించారు.
ప్రధాన రహదారుల్లోని మ్యాన్హోళ్లు, నాలాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ నిమజ్జనం, బక్రీద్ ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్ష పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్లో 119 యాక్షన్ టీ మ్లతోపాటు సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ సీఎంకు వివరించారు.
జిల్లాల్లోనే కాకుండా రాష్టస్థ్రాయిలోనూ కంట్రోల్ రూమ్ (040-23454088) ఏర్పాటు చేయడంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లతో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్చంద్ర వెంటనే ఫోన్లో మాట్లాడారు.
పోలీస్ సూపరింటెండెంట్లతో కలిసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని ప్రదీప్చంద్ర ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బంది కలిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు.
తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాతోపాటు పారిశుద్ధ్యం బాగుండేలా చూసుకోవాలని ప్రదీప్ చంద్ర ఆదేశించారు. అంబులెన్స్లను, అవసరమైన మందులను సిద్ధం చేసుకుని అత్యవసర సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా డిస్కమ్లు జాగ్రత్త వహించాలన్నారు. రైల్వే లైన్లు, లో లెవల్ కాజ్ వేలు, బ్రిడ్జిల వద్ద ఎప్పటికప్పుడు నీటి ప్రవాహస్థాయిని అంచనా వేసి అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువుకట్టల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనించాలని నీటిపారుదల శాఖను, గ్రామస్థాయిలో ఉండే విఆర్ఎ, విఏవోలను ప్రదీప్ చంద్ర ఆదేశించారు.
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తోంది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు:
ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంగోలులో 15, సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురిచేడులో 9.4, ముండ్లమూరు, మద్దిపాడులో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.