మల్లారెడ్డి సొంత వ్యాపార లావాదేవీలకు ప్రత్యేక బ్యాంక్.. ఐటీ దాడుల్లో కీలక విషయాలు!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏకకాలంలో మల్లారెడ్డి చెందిన ఇళ్ళు, కార్యాలయాలపై, ఆయన కూతురు, ఇద్దరు కుమారులు, ఆయన బంధువుల ఇళ్ల పై 50 బృందాలుగా ఏర్పడి ఆదాయపన్ను శాఖ అధికారులు నిన్న దాడులు మొదలు పెట్టారు . ఈ దాడుల్లో మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధించిన అనేక కీలక విషయాలు ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. అన్నిటికంటే ముఖ్యంగా మల్లారెడ్డి సొంత వ్యాపారాల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు ఇన్కమ్ టాక్స్ అధికారులు గుర్తించారు.

మల్లారెడ్డి ఓ ప్రత్యేక బ్యాంకు ద్వారా వ్యాపార లావాదేవీలు
మంత్రి మల్లారెడ్డి తనకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇతర వ్యాపారాలకు చెందిన లావాదేవీలు ఊరు పేరు లేని ఒక చిన్న కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా కొనసాగిస్తున్నారని ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. మల్కాజ్ గిరి లో ఉన్న క్రాంతి బ్యాంక్ కేంద్రంగా మల్లారెడ్డి కి చెందిన వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయని గుర్తించారు. దీంతో అధికారులు సదరు బ్యాంక్ ను జల్లెడ పడుతున్నారు.

క్రాంతి బ్యాంక్.. బ్యాంక్ చైర్మన్ ఇంట్లోనూ ఐటీ సోదాలు
ఇదిలా ఉంటే మరోవైపు క్రాంతి బ్యాంకులోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంకు చైర్మన్ మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి అని సమాచారం. ఇక క్రాంతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంస్థల చైర్మన్ వీ రాజేశ్వర గుప్త ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలానగర్ రాజు కాలనీ లోని ఆయన నివాసానికి చేరుకున్న అధికారుల బృందం ఆయన ఇంట్లో కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. క్రాంతి బ్యాంకు నుంచి స్థిరాస్తి వ్యాపారానికి నిధులు దారి మళ్ళాయి అని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రాంతి బ్యాంకు తో పాటుగా, బ్యాంకు చైర్మన్ ఇంటిపైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు.

లెక్కలేనన్ని వ్యాపార లావాదేవీలు .. సోదాలలో ఏమి దొరుకుతాయో
ఇక సోదాల సమయంలో మల్లారెడ్డి ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయన తన మొబైల్ ఫోన్ ఐటీ అధికారులకు చిక్కకుండా దాచిపెట్టారు. ఇక సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పక్క ఇంట్లో ఒక గోనెసంచిలో మల్లారెడ్డి ఫోన్ ఉండడాన్ని గుర్తించి ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కి సంబంధించి కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇలా లెక్కలేనన్ని వ్యాపార లావాదేవీలు ఉండటంతో ఐటీ సోదాలలో ఏమి దొరుకుతాయో అన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.

క్రాంతి బ్యాంకు వ్యవహారలపైనే ఐటీ అధికారుల ఫోకస్
మల్లారెడ్డి కి సంబంధించిన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు ఎవర్ని వదలకుండా అధికారులు బృందాలుగా విడిపోయి చేసిన మూకుమ్మడి తనిఖీలలో సుమారు ఐదు కోట్ల నగదు, అనేక కీలకమైన పత్రాలు, ఆస్తిపాస్తులు వివరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సోదాల్లో మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన తీవ్రమైన నేరాలు ఏవైనా బయటపడితే అరెస్టుల వరకు వెళ్లే అవకాశం లేకపోలేదు అన్నది ఆసక్తికరమైన చర్చ. ముఖ్యంగా క్రాంతి బ్యాంకు వ్యవహారాల్లోనే తేడాలు కనిపిస్తాయి అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే మంత్రి మల్లారెడ్డి పై సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications