కేటీఆర్ సిరిసిల్లపై వెనక్కి, 'జనగామ' లేదు: 14 కొత్త జిల్లాలు ఇవే
హైదరాబాద్: జిల్లాలు, కొత్త డివిజన్లు, మండల పునర్ వ్యవస్థీకరణ పైన ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడున్న పది జిల్లాలతో పాటు కొత్తగా మరో 14 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్ల పైన వెనక్కి తగ్గారు.
మంగళవారం మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు పలువురు ఉన్నాతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని, ఈ నెల మూడోవారంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు.
ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అనంతరం నెల రోజులపాటు అభ్యంతరాలు/అభిప్రాయాలను స్వీకరించి, వాటి పరిష్కారం తర్వాత తుది నోటిఫికేషన విడుదల చేయాలని ఆదేశించారు. ప్రాథమిక నోటిఫికేషన జారీకి ముందే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు.
దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన మరో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న 14 జిల్లాలతో పాటు అదిలాబాదులోని నిర్మల్ను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదన పైన చర్చించారు. తొలుత సిరిసిల్లను అనుకున్నారు. ఇప్పుడు దాని స్థానంలో నిర్మల్ను జిల్లాగా చేయనున్నారు. జనగామ, గద్వాల్ జిల్లాల కోసం ఉద్యమం జరుగుతోంది. అయినప్పటికీ వాటిని జిల్లాలుగా చేయలేదు. జనగామలో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది.
కొత్త జిల్లాలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు కొత్త పది జిల్లాలు, 74 మండలాలతో కూడిన ముసాయిదా జాబితాను సీఎస్ కమిటీ అందించింది. ఈ డ్రాఫ్టులో నిర్మల్కు చోటు దక్కగా, సిరిసిల్ల అవకాశం కోల్పోయింది. కొత్త జిల్లాలపై ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాలు
సిరిసిల్లను జిల్లా చేయడానికి సమతూకం లేదని, ఇప్పటికే కరీంనగర్లో జగిత్యాల జిల్లాను ప్రతిపాదించినందున కొత్తగా మళ్లీ సిరిసిల్లను చేయడానికి ఏ మాత్రం అవకాశం లేదని నిర్ణయించారు. సిరిసిల్ల జిల్లా ప్రతిపాదన పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కొడుకు (కేటీఆర్), అల్లుడు (హరీష్ రావు) మధ్య గొడవ లేకుండానే సిరిసిల్లను జిల్లా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు దానిపై వెనక్కి తగ్గారు.
కొత్త జిల్లాలు
కొత్త జిల్లా చేయడానికి నిర్మల్కు అన్ని విధాలా అర్హతలు ఉన్నాయని కమిటీ పేర్కొంది. గూగుల్ మ్యాప్ ఆధారంగా మండలాలు, గ్రామాలను పరికించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలు అశాస్త్రీయంగా కలిపారంటూ వాటిలో మార్పులు చేశారు. కొత్త జిల్లాలకు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలను సీఎం కేసీఆర్ అభినందించారు.
కొత్త జిల్లాలు
సిరిసిల్లపై నిష్పాక్షిక నివేదిక ఇచ్చారని, పాలనా సౌలభ్యం, పారదర్శకత, ప్రజాభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్నారని సీఎం కేసీఆర్ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. నిర్మల్ను జిల్లా చేయడానికి ఆయన సుముఖత తెలిపారు. ఆయన గూగుల్లో నిర్మల్ ప్రాంతాన్ని చూపుతూ దానిని ఎందుకు జిల్లా చేయాల్సి ఉందో అధికారులకు వివరించారు. నిర్మల్ జిల్లా ప్రతిపాదన ముందుగా లేదని, తాను గూగుల్లో పరిశీలించి దాని అవసరాన్ని గుర్తించానని వెల్లడించారని తెలుస్తోంది.
కొత్త జిల్లాలు
ఆదిలాబాద్ జిల్లా విభజన జరిగిన తర్వాత కూడా నిర్మల్ ప్రాంతానికి మేలు జరగకుండా గతంలో మాదిరిగానే ఉంటే అది అన్యాయమే అవుతుందని తాను భావించానని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. కొత్త జిల్లాలను ఖరారు చేస్తున్న సమయంలో అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు.
కొత్త జిల్లాలు
సీఎస్ కమిటీ ముసాయిదా జాబితాలో కొత్త, పాత జిల్లాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, కరీంనగర్, జగిత్యాల, అదిలాబాద్, కొమురం భీమ్ (మంచిర్యాల), నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి (కొత్తగూడెం), సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ (భూపాలపల్లి)లు ఉన్నాయి.