తెలంగాణలో కొత్తగా 40 మండలాలు, విద్యుత్ ఉద్యోగుల సమస్యపై కేంద్రానికి హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 40 మండలాలు ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకుని మండలాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి యాభైవేల మంది జనాభాకు ఒక మండలం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 25ఏళ్ల క్రితం మండలాలు ఏర్పాటయ్యాయని, అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా ఎంతో పెరిగిందని, ఈ నేపథ్యంలో మండలాల సంఖ్య పెంచక తప్పని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు కొత్త మండలాలు ఏర్పాటుకానున్నాయి. కొత్త మండలాలు ఏర్పడితే ప్రజలకు, పాలనకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 3లోగా విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
స్థానికత ఆధారంగా తెలంగాణ జెన్కో నుంచి రిలీవ్ చేసిన 1,253 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్పై ఉమ్మడి హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సెప్టెంబర్ 3వ తేదీలోగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించింది. గత కొన్ని నెలల నుంచి విద్యుత్ ఉద్యోగులు ఈ సమస్యపై పోరాడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేని విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లారు.