నిజాంపై 2 రకాలుగా: నలిగిపోయామని తెలంగాణ ప్రభుత్వం, గొప్పవాడని కేసీఆర్
హైదరాబాద్: నిజాం పాలన విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఓ రకంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోరకంగా చెప్పారంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి సోమవారం నాడు ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
సుదీర్ఘ నిజాం భూస్వామ్య పాలనలో తెలంగాణ నలిగిపోయిందని, భూస్వామ్య వ్యవస్థ పాతుకుపోయిన కారణంగా అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడిపోయిందని, అదే సమయంలో తెలంగాణతో పోలిస్తే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు సామాజికంగా బాగా ముందున్నాయని, తెలంగాణలో ముఖ్యంగా ఐదు జిల్లాలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నాయని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సర్కార్ పేర్కొందని రాసింది.
అదే సమయంలో సీఎం కేసీఆర్.. నిజాం గొప్ప రాజు అని, ఆయన సమాధికి నివాళులు అర్పించినందుకు విమర్శల దాడికి దిగుతున్నారని, అందులో తప్పేముందని, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు కట్టిన ఘనత ఆయనదేనని... 2015 జనవరి 1న పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభోత్సవంలో అన్నారని పేర్కొంది.
సుదీర్ఘ నిజాం భూస్వామ్య పాలనలో తెలంగాణ నలిగిపోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ప్రపంచబ్యాంకుకు తెలిపారని పేర్కొంది. నిజాం పాలనలో జరిగిన అన్యాయం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలతో పాటు తెలంగాణలోని ఐదు జిల్లాలోలని కీలక సమస్యలను ప్రభుత్వం ఏకరువు పెట్టింది.