ఒమిక్రాన్ కలకలం: హైదరాబాద్లో టోలిచౌకి ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్ ప్రకటన
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్.. ఇటీవల మనదేశంలోకి.. బుధవారం తెలంగాణలోకి ప్రవేశించింది. హైదరాబాద్లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఈ క్రమంలోనే మెహిదీపట్నంలోని టోలిచౌకి పారామౌండ్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆ రెండు కేసులు వెలుగుచూసిన పారామౌంట్ కాలనీలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు.
బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒమిక్రాన్ కేసులు బయటపడినవారి నివాసాలకు సమీపంలోని 25 ఇళ్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కరోనా వైరస్ ఏ వేరియంట్కైనా మాస్క అనే ఆయుధం వాడాలని, సక్రమంగా మాస్క్ పెట్టుకుంటే ఏ వైరస్ దరిచేరదని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఒమిక్రాన్ పాజిటివ్గా గుర్తించిన విదేశీయులు నివసిస్తున్న ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. ఆ కాలనీలు, అపార్ట్మెంట్లలో అధికారులు ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. బుధవారంనాడే టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీ మొత్తం యాంటీబాక్టీరియల్ మందును స్ప్రే చేశారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.