తిరుమలలో ఉదయాస్తమాన సేవా టికెట్లు - ధర కోటిన్నర రూపాయలు : ఇందులో ప్రత్యేకతలివే..!!
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయాస్తమాన సేవను తిరిగి ప్రవేశ పెడుతూ నిర్ణయించింది. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2006లో ఉదయాస్తమాన సేవను రద్దు చేసిన టీటీడీ.. 2006 వరకు కేటాయించి మిగిలిపోయిన 531 టికెట్లను భక్తులకు కేటాయించాలని గత పాలకమండలిలో టీటీడీ నిర్ణయించింది. అయితే మామూలు రోజుల్లో కోటి రూపాయలు, శుక్రవారం రోజు కోటిన్నర రూపాయలకు ఉదయాస్తమాన సేవ టికెట్లను టీటీడీ జారీ చేయనుంది.
సేవ టిక్కెట్ కోటిన్నార రూపాయాలు
శుక్రవారం అభిషేకం, మేల్ఛాట్ వస్త్రం సేవలు ఉన్న క్రమంలో టికెట్ ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు. తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు టీటీడీ స్థలాన్ని గుర్తించింది. శాశ్వత ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని, దీనికోసం ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయించాలని..దీని కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవ కింద టిక్కెట్లు పొందిన భక్తులు ఏడాదిలో ఒక్కరోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఉదయాస్తమాన సేవ టిక్కెట్ పొందితే
గతంలో సాధారణ రోజులకు సంబంధించి ఒక టికెట్ (ఆరుగురికి) రూ.లక్ష, శుక్రవారం రోజుకు రూ.5 లక్షలకు విక్రయించేవారు. ఈ క్రమంలో ఉదయాస్తమాన సేవా టికెట్లు పొందిన భక్తుల సంఖ్య అధికం కావడంతో 2006 నుంచి విక్రయాలను నిలిపివేశారు. అయితే వివిధ కారణాలతో కొన్ని టికెట్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని కాలపరిమితి పూర్తికావడంతో దాదాపు 531 టికెట్ల వరకూ ఖాళీలు ఏర్పడ్డాయి.
వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను రూ.కోటిగా, శుక్రవారం రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు. ఈ టికెట్లు కొనుగోలు చేసే భక్తులు దాదాపు 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఒక్కరోజు వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు జరిగే ఆర్జితసేవల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టీటీడీ నిర్ణయం వెనుక లక్ష్యం ఇదే..
అయితే టికెట్ల కేటాయింపులో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ కింద ఈ టికెట్లను కేటాయించనున్నారు. వీటి ద్వారా టీటీడీకి దాదాపు రూ.600 కోట్లు లభించనుంది. ఈ మొత్తంతో చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఉదయాస్తమాన సేవ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా టీటీడీ బోర్డు దాదాపు 600 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ మొత్తాన్ని ఆస్పత్రికే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని పైన టీటీడీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.