కేజీ బేసిన్ గ్యాస్ లీకేజీలపై ఏపీ సర్కార్కు ఎన్టీటీ నోటీసులు- నిపుణుల కమిటీ నియామకం..
ఏపీ తీర ప్రాంతంలోని కృష్ణా-గోదావరి బేసిన్లో చమురు తవ్వకాలు, చమురు నిల్వల కోసం అన్వేషణ భారీ ఎత్తున సాగుతుంటుంది. ఇందులో ప్రభుత్వ రంగ సంస్ద ఓఎన్జీసీతో పాటు రిలయన్స్ వంటి ప్రైవేటు సంస్ధలు కూడా పాలు పంచుకుంటున్నాయి. అయితే చమురు తవ్వకాల కారణంగా కేజీ బేసిన్లో కాలుష్య ప్రభావం పెరుగుతోంది.
అంతే కాకుండా చమురు పైప్లైన్ పేలుళ్లు, లీకేజీలతో స్ధానికంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా వాటిల్లుతోంది. దీనిపై ఇప్పటికే స్ధానికుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది.
కేజీ బేసిన్లో తరచూ సంభవిస్తున్న చమురు పైప్లైన్ల పేలుళ్లు, లీకేజీల వల్ల గోదావరి జిల్లాల పరిధిలో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నాయంటూ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన వెంకటపతిరాజా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ రామకృష్ణన్, సైబల్ దాస్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం, కృష్ణా, గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
కేజీ బేసిన్లో చమురు తవ్వకాల కారణంగా తలెత్తుతున్న కాలుష్య స్ధాయిల్ని అంచనా వేసేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు, కృష్ణా-గోదావరి జిల్లాల కలెక్టర్లు, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ను సభ్యుడిగా నియమించింది. ఈ కమిటీ రెండు నెలల్లోగా తమ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.