నాలుగు రోజుల్లో ఆనందయ్యమందు- కృష్ణపట్నం పోర్టుకు మారిన తయారీ వేదిక
నెల్లూరులో ఆనందయ్య కరోనా మందు తయారీ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన మందు తయారీని కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. అక్కడ పోలీసు భద్రత మధ్య ఆనందయ్య మందును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందుకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రత మధ్య ఈ మందు తయారు చేయిస్తోంది.
కృష్ణపట్నం గ్రామంలోనే ఈ మందు తయారీ ప్రారంభించినప్పటికీ అక్కడ ఆనందయ్యకు భద్రత లేదని పోలీసులు భావించారు. దీంతో మందు తయారీ ప్రక్రియను పోర్టుకు తరలించినట్లు తెలుస్తోంది. పోర్టులో అయితే ఎలాగో ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మందు తయారీకి ఇప్పటికే భారీ ఎత్తున ముడిసామాగ్రి అందుబాటులో ఉంచుకున్న ఆనందయ్య నాలుగు రోజుల్లో మందు తయారు చేసి పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవైపు కరోనా మందు తయారీ స్ధలం మారినా కృష్ణపట్నం గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలోకి అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు. ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిసి వివిధ ప్రాంతాలకు చెందిన వారు కృష్ణపట్నానికి తరలివస్తున్నారు. దీంతో పోలీసులకు వీరిని నియంత్రించడం కష్టంగా మారింది. మందు తయారీ కొనసాగుతుందని, సిద్ధమయ్యేందుకు నాలుగు రోజులు పడుతుందని పోలీసులు వారికి చెప్పి వెనక్కి పంపుతున్నారు. గ్రామస్ధుల్ని సైతం ఆధార్ కార్డులుంటేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.