యడ్డీ తొలగింపు వ్యవహారం-తెరపైకి లింగాయత్ చర్చ-బీజేపీ అధిష్టానానికి చిక్కులు
కర్నాటకలో సీఎం యడియూరప్పను మార్చేందుకు బీజేపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ పాత చర్చల్ని తిరగి తెరపైకి తెస్తున్నాయి. గతంలో బీజేపీని వీడి సొంత పార్టీ పెట్టుకుని లింగాయత్ ఓట్లకు గండికొట్టిన యడియూరప్పను తిరిగి తొలగిస్తే చోటు చేసుకునే పరిణామాలపై కాషాయదళంలో అంతర్గతంగా భారీ చర్చ జరుగుతోంది. కర్నాటక రాజకీయాల్లో లింగాయత్ లకు ఉన్న ప్రాధాన్యం దృష్టా ఈ చర్చ తెరపైకి వస్తోంది.
యడ్డీ తొలగింపు వ్యవహారం
కర్నాటక సీఎం యడియూరప్పను ఆ పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో పదవిని కాపాడుకునేందుకు ఆయన కూడా అంతే దీటుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం కాస్తా కుల రాజకీయాలకు దారి తీస్తోంది. గతంలో యడ్డీని అర్ధాంతరంగా తొలగించినప్పుడు ఆయన వాడిన కులం మంత్రాన్నే ఇప్పుడు కూడా తెరపైకి తెస్తున్నారు. దీంతో యడ్డీ విషయంలో ఏం చేయాలనే దానిపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
తెరపైకి లింగాయత్ రాజకీయం
కర్నాటక సీఎం పదవి నుంచి యడియూరప్పను తొలగించేందుకు బీజేపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలతో ఆయన కులం లింగాయత్ లంతా ఏకమయ్యే పరిస్ధితులు వస్తున్నాయి. ముఖ్యంగా కర్నాటక రాజకీయాల్లో చాలా కాలంగా మౌనంగా ఉన్న లింగాయత్ లు ఇప్పుడు యడ్డీకి అండగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం కూడా ఆత్మరక్షణలో పడే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. బీజేపీ ప్రయత్నాలతో కర్నాటకలోని వీరశైవ లింగాయత్ పీఠాధిపతుల మద్తతు యడ్డీకి పెరుగుతోంది. కర్నాటకలోని లింగాయత్ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలభారత వీరశైవ మహాసభ కూడా యడ్డీకి మద్దతుగా నిలుస్తోంది. లింగాయత్ లలోనూ యడ్డీని మించి ప్రజాదరణ ఉన్న మాస్ లీడర్ కూడ మరొకరు లేకపోవడంతో అది కూడా ఆయనకు కలిసివస్తోంది.
2013 రిపీట్ హెచ్చరికలు
2013లో అప్పటి సీఎంగా ఉన్న యడియూరప్పను బీజేపీ అధిష్టానం తప్పించింది. దీంతో ఆయన కేజేపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకుని బీజేపీని భారీగా దెబ్బకొట్టారు. దీంతో కాంగ్రెస్ కు బీజేపీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి యడ్డీని తొలగించినా అదే పరిస్ధితి తప్పదనే అంచాలు బీజేపీలోనే వ్యక్తమవుతున్నాయి. దీంతో యడ్డీని తొలగించడం అంటే యడ్డీని వదులుకోవడమే అనే భావన బీజేపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. లింగాయత్ లలోనూ యడ్డీని మించి ఆదరణ ఉన్న నేత లేకపోవడం కూడా ఆయనకు కలిసివస్తోంది. దీంతో యడ్డీని తొలగిస్తే తిరిగి 2013 నాటి పరిస్ధితులు రిపీట్ అవుతాయని బీజేపీలోని ఆయన వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు.