షాకింగ్: పెళ్ళిలో ఇష్టమైన డీజేసాంగ్ పెట్టలేదని వధువు బంధువును హత్య చేసిన వరుడు
ఇటీవల కాలంలో హత్యలు చేయడానికి పెద్ద కారణాలు అవసరం లేకుండా పోయింది. అడిగిన కూర వండు లేదని, ఫ్రెండ్ 2 వందలు అడిగితే ఇవ్వలేదని ఇలా చిన్నచిన్న కారణాలకే హత్యలు చేస్తున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక తాజాగా యూపీ లోని ముజఫర్ పూర్ ప్రాంతంలో షాపూర్ లో జరిగిన పెళ్లి వేడుకలో డిజె సాంగ్ పెట్టలేదని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.
ఇటీవల కాలంలో వివాహ వేడుకలు ఏవైనా డిజె సాంగ్ లు పెట్టడం, అందరూ కలిసి డాన్స్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. యూపీలోని ముజఫర్ పూర్ ప్రాంతంలోని షాపూర్ లో ఓ పెళ్లి వేడుక సందర్భంగా వరుడు ఇప్తికార్ పెళ్లికి వచ్చిన అతిథుల తో కలిసి డీజే సాంగ్స్ కు ఉత్సాహంగా డాన్సులు వేసాడు. సంతోషంగా సాగుతున్న పెళ్లి వేడుకలో డీజే పాటలు పెట్టిన వధువు తరపు బంధువు జాఫర్ అలీ తనకు ఇష్టమైన పాట పెట్టలేదని వరుడు ఇప్తికార్ సదరు వ్యక్తితో గొడవకు దిగాడు.
వారి మధ్య వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో పట్టలేని ఆగ్రహంతో వరుడు తాను పెళ్లి చేసుకున్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీసి అందరూ చూస్తుండగానే, వధువు బంధువు అయిన జాఫర్ అలీ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వధువు బంధువు జాఫర్ అలీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అతనిని కాపాడలేకపోయారు. మార్గమధ్యలోనే జాఫర్ అలీ మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పెళ్లికి వచ్చిన ఖర్మానికి ఊహించని విధంగా వధువు బంధువు ప్రాణాలు కోల్పోగా, ఆవేశపరుడు అయిన వరుడిని పెళ్లి చేసుకున్న ఖర్మానికి వధువు లబోదిబోమంటుంది. శుభమా అంటూ పెళ్లి చేసుకుని పెళ్ళాంతో సంతోషంగా ఉండాల్సిన వరుడు క్షణికావేశంలో చేసిన హత్యతో కటకటాలపాలయ్యాడు. కేవలం డీజే పాట కోసమే ప్రాణాలు తీశాడు అంటే అతని మానసిక స్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.