జస్ట్ మిస్-గాల్లో గుద్దుకోబోయి తప్పించుకున్న రెండు విమానాలు-బెంగళూరు ఎయిర్ పోర్టులో
బెంగళూరు ఎయిర్ పోర్టులో ఈ నెలలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గాల్లో రెండు విమానాలు పరస్పరం ఢీకొనబోయి తప్పించుకున్న ఘటన జరిగింది. రాడార్ కంట్రోలర్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోంది.
జనవరి 7న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు బయలుదేరాల్సి ఉంది. ఇందులో ఒకటి కోల్ కతాకు కాగా, మరొకటి భువనేశ్వర్ కు వెళ్లాల్సి ఉంది. ఈ రెండు విమానాలూ ఒకే సమయంలో టేకాఫ్ అయ్యేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పొరబాటున అనుమతి ఇచ్చేశారు. దీంతో రెండు విమానాలు ఒకదానికి తెలియకుండా ఒకటి టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. విమానాశ్రయంలో రెండు రన్ వేలు ఉన్నాయి.
ఇందులో ఓ విమానానికి ఓ రన్ వే పై నుంచి, మరో విమానానికి మరో రన్ వే పై నుంచి టేకాఫ్ అయ్యేందుకు అనుమతి లభించింది. కానీ ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఒకేసారి రెండు రన్ వేలపై నుంచి టేకాఫ్ అయ్యే పరిస్ధితులు లేవు. ఫలితంగా, రెండు విమానాలు కలుస్తున్న రన్వేల నుంచి ఒకేసారి టేకాఫ్కు అనుమతి లభించింది. దీంతో అదే దిశలో వెళ్తున్న విమానం ఒకదానికొకటి ఢీకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది చూసిన రాడార్ కంట్రోలర్ వెంటనే జోక్యం చేసుకుని విమానాన్ని అప్రమత్తం చేసింది.
ఈ సంఘటన, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్లైన్స్ రెండూ డిజిసిఎకు నివేదించడంతో ఇందుకు దారితీసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల వైఫల్యంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన ఉదయం, ఉత్తర రన్వే విమానాలు టేకాఫ్ కావడానికి, అలాగే దక్షిణ రన్వే ల్యాండింగ్ కు వాడారు. తర్వాత, షిఫ్ట్ ఇన్ఛార్జ్ దక్షిణ రన్వేను మూసివేయాలని నిర్ణయించుకున్నారు, అయితే దక్షిణ టవర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు ఈ విషయం తెలియజేయలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సీనియర్ అధికారి తెలిపారు.