మనది ‘పూర్ ఇంగ్లీష్’ అంటూ న్యూజిలాండ్ షాక్: వీసాల కోత
భారత విద్యార్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానం సరిగా లేదంటూ న్యూజిలాండ్ ప్రభుత్వం భారీ సంఖ్యలో వీసాల కోత విధించింది.
హైదరాబాద్/అక్లాండ్: భారతీయ విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరం చేసి షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. అంతేగాకుండా గడిచిన 5నెలల్లో భారతీయ విద్యార్థులకు ఇస్తున్న వీసాల్లో గణనీయమైన కోత విధించింది. నిరుడు జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భారతీయ విద్యార్థులకు 6,462 వీసాలు ఇవ్వగా, ఈ ఏడాది కేవలం 3,102 వీసాలు మాత్రమే ఇచ్చింది.
మన విద్యార్థులకు ఇచ్చే స్టడీ వీసాలలో ఏకంగా సగానికిపైగా కోత పెట్టడం గమనార్హం. వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ఖచ్చితమైన పర్యవేక్షణ ఉంచడంతో స్టడీ వీసాలు తగ్గాయని, భారత్ నుంచి చాలామంది విద్యార్థులు తగినంత డబ్బు, తగినంత ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకుండానే ఇక్కడి వస్తుండటంతో వారిని నిలువరించినట్టు న్యూజిలాండ్ ప్రభుత్వ రేడియో స్పష్టం చేసింది.
కాగా, భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వడంలో న్యూజిలాండ్ ప్రభుత్వం విపరీత పోకడలు పోతున్నదని అక్కడి అక్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ పేర్కొంది. 16 ప్రైవేటు ఇన్స్టిట్యూట్ల సమాహారమైన ఈ సంస్థ అధికార ప్రతినిధి పాల్ చాల్మర్స్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని రకాల సమర్థులైన విద్యార్థుల వీసా దరఖాస్తులను కూడా ముంబైలోని న్యూజిలాండ్ రాయబార కార్యాలయం తిరస్కరిస్తున్నదని, ఇది తమ దేశంలోని విద్యాసంస్థలను దెబ్బతీయవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గతంలో పలువురు తెలుగు విద్యార్థులను కూడా న్యూజిలాండ్.. ఇంగ్లీష్, సరైన పత్రాలు లేవంటూ, తదితర కారణాలతో వెనక్కి పంపిన విషయం తెలిసిందే.