అరగంట టైమిస్తున్నా.. అడిగింది చెప్పండి.. కామారెడ్డి కలెక్టర్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిన్న నిర్మలాసీతారామన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు పర్యటన సాగిస్తున్న నిర్మలా సీతారామన్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై మండిపడ్డారు.
రేషన్ షాప్ తనిఖీ చేయటానికి వెళ్ళిన కేంద్రమంత్రి కలెక్టర్ పై సీరియస్
బీర్కూర్ లో శుక్రవారం రేషన్ షాప్ ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలాసీతారామన్ రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను ప్రశ్నించారు. దానికి కలెక్టర్ తనకు తెలియదని సమాధానం చెప్పడంతో, కలెక్టర్ అయి ఉండి తెలియదంటారా అంటూ నిర్మల సీతారామన్ కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. అర గంటలో తెలుసుకొని చెప్పాలని కలెక్టర్ ను ఆదేశించారు. రెండో రోజు పర్యటనలో అడుగడుగునా నిర్మలా సీతారామన్ కలెక్టర్ పై అసహనం వ్యక్తం చేశారు.
ఆ వాటా చెప్పాలని కలెక్టర్ కు అరగంట టైం ఇచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంతో తెలియకుండా ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్ అయ్యుండి మీరు తెలుసుకోకుండా ఎలా ఉన్నారు అంటూ నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. అరగంట టైం ఇస్తాను తెలుసుకొని చెప్పమని కలెక్టర్ కు చెప్పిన మంత్రి నిర్మల సీతారామన్, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయలు ఖర్చవుతుందని, కేంద్ర ప్రభుత్వం అందులో 30 రూపాయలు భరిస్తుందని తెలిపారు.
రేషన్ షాప్ లో ప్రధాని మోడీ ఫోటో లేదని ఆగ్రహం
ఇక రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడం గమనించిన కేంద్రమంత్రి ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని మరోమారు కలెక్టర్ ను నిలదీశారు. ప్రధాని మోడీ ఫోటో మీరు పెట్టకపోతే తానే స్వయంగా వచ్చి ప్రధాని మోడీ ఫోటోలను రేషన్ షాపుల్లో పెట్టి వెళతాను అంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. ఆపై కోటగిరి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.
నిర్మలా సీతారామన్ పర్యటనపై ఆసక్తి
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్కారుపై, కెసిఆర్ పాలనపై నిప్పులు చెరుగుతున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా జిల్లా కలెక్టర్ ను టార్గెట్ చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. నిర్మల సీతారామన్ పర్యటన ముగిసేసరికి ఆమె మరెంతగా ప్రభుత్వంపై విరుచుకు పడతారో అన్నది ఆసక్తికరంగా మారింది.