వైసీపీలో కలవరం: బీజేపీకి అండగా ఎమ్మార్పీఎస్: రత్నప్రభ కోసం ఏకతాటిపై: మారిన ఈక్వేషన్లు
తిరుపతి: ఊహించినట్టే.. మాదిగ నేతలు ఏకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. కమలనాథుల తరఫున తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగనున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ కోసం మాదిగ నేతలు ఏకం అయ్యారు. తమ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభను లోక్సభకు పంపించడానికి సమాయాత్తమౌతున్నారు. ఈ పరిణామాలతో తిరుపతి లోక్సభ పరిధిలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కల్పించినట్టయింది.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ ఫైర్బ్రాండ్: నాడునిప్పు రాజేసి..!
సునీల్ దేవ్ధర్తో ఎమ్మార్పీఎస్ నేతల భేటీ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉప్పాలపాటి బ్రహ్మయ్య మాదిగ.. బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్కు చెందిన కొందరు కీలక నాయకులు ఉన్నారు. సునీల్ దేవ్ధర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ దేవ్ధర్ వారికి శాలువ కప్పి సత్కరించారు. తిరుపతి లోక్సభ పరిధిలో మాదిగ సామాజిక వర్గ ఓటుబ్యాంకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మాదిగ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.
మారిన సమీకరణాలు..
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసినట్టయింది. బీజేపీతో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ.. తమ సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభను లోక్సభకు పంపించాలనే ఏకైక ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ నేతలు బీజేపీకి అండగా నిలిచినట్లు చెబుతున్నారు. ఆమెను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేసీతో ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి రత్నప్రభను గెలిపించేలా క్షేత్రస్థాయిలో తమ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకును ప్రభావితం చేసేలా వ్యూహాలను రూపొందిస్తున్నారు. మాల-మాదిగ సామాజిక వర్గాలకు చెందిన జనాభాలో ఉన్న వ్యత్యాసం మూడుశాతం మాత్రమే. మాల సామాజిక వర్గ ప్రజలు మూడు శాతం మేర అధికంగా ఉంటున్నారు.
మంద కృష్ణ మాదిగ హాజరు?
ఎమ్మార్పీఎస్ ఏపీ శాఖ నాయకులు బీజేపీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో- తెలంగాణకు చెందిన ప్రముఖ మాదిగ నేత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మంద కృష్ణ మాదిగ ఇక ప్రచార బరిలో దిగొచ్చని తెలుస్తోంది. రత్నప్రభ కోసం ఆయన ఉప ఎన్నిక ప్రచారం కోసం తిరుపతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలను నిర్వహించడం దాదాపు ఖాయమైనట్టే.
కత్తి మహేష్ దూరం
మాదిగ సామాజిక వర్గానికి చెందిన కత్తి మహేష్.. ఈ విషయంలో దూరంగా ఉంటున్నారు. బీజేపీతో ఉన్న సైద్ధాంతిక విభేదాలను తాను విస్మరించలేనని కత్తి మహేష్ ఇదివరకే ప్రకటించారు కూడా. ఆయన సొంత జిల్లా చిత్తూరే. రత్నప్రభతో సమావేశమైన తరువాత కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఓడిపోయే సీటులో మాదిగ సామాజిక వర్గ అభ్యర్థిని బరిలోకి దింపారంటూ ఆయన ఇదివరకే విమర్శించారు. బీజేపీ లాంటి దళిత వ్యతిరేక పార్టీ నిలబెట్టిన స్థానికేతర మాదిగ మాజీ ఐఏఎస్ అధికారిణికి ఓటు వెయ్యాలనే వాదనలో చాలా లోపం ఉందంటూ కత్తి మహేష్ విమర్శలు గుప్పించారు.