దిశ బిల్లుపై వైసీపీ సెల్ఫ్ గోల్ ; కేంద్రాన్ని ఇరికించబోయి వైసీపీనే అడ్డంగా .. మొదలైన కొత్త రగడ !!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీ ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికించాడా? దిశ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందలేదని, పార్లమెంటులో ఆమోదం పొందగానే రాష్ట్రంలో దిశ అమలులోకి వస్తుందని ప్రచారం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంపీ తన ప్రశ్న తో సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారా ? దిశా బిల్లుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్నది ఉత్తుత్తి హడావుడేనా ? ఇక ఈ వ్యవహారం ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారబోతుందా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
Recommended Video
దిశా చట్టం 2019.. ఏపీ హడావిడి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ సామూహిక అత్యాచార ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిశ చట్టాన్ని తీసుకు వస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో భాగంగా అసెంబ్లీలో దిశా బిల్లును ఆమోదించి, పార్లమెంటుకు పంపించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టం అమలు చేసే క్రమంలో దిశ యాప్ వంటి ఏర్పాట్లు శరవేగంగా చేసేశారు. దిశ యాప్ పై అవగాహన కార్యక్రమాలు కూడా నేటికీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
దిశా చట్టం అమలుకు .. పార్లమెంట్ లో ఆమోదం పొందకపోవటం కారణం అన్న ఏపీ
ఇప్పటి వరకు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందక పోవడంతో, దిశ చట్టం అమలు కావడం లేదని, ప్రభుత్వం తమ వంతు బాధ్యత నిర్వర్తించిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పార్లమెంటు సమావేశాలకు ముందు జగన్ తో జరిగిన భేటీలో కూడా దిశ చట్టాన్ని కేంద్ర ఆమోదించేలా చూడాలని చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని చెప్పుకోవాలని చూసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దిశ చట్టంపై లిఖితపూర్వక ప్రశ్న అడగగా, దానికి కేంద్రం ఏపీ సర్కార్ కు దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది.
దిశా బిల్లుపై ఎంపీ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్లమెంటుకు పంపించిన దిశా బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని సవరించి తిరిగి పంపాలని గతంలోనే సూచించామని అయితే ఏపీ నుండి స్పందన రాలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అప్పుడు అధికారులు సైతం వాటి సవరణలపై దృష్టిపెట్టినట్లు గా వార్తలు వచ్చాయి. కానీ అప్పటినుండి ఇప్పటివరకు కేంద్రం సూచించిన సవరణలపై , కేంద్రం తెలియజేసిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీంతో ప్రశ్న అడిగిన ఎంపికే కాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సైతం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టైంది.
దిశా బిల్లు ఆమోదం పొందకపోవటానికి ఏపీ ప్రభుత్వమే కారణమన్న కేంద్రం
రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం దిశ చట్టం పై, దిశా యాప్ పై పెద్దఎత్తున ప్రచారం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దిశ యాక్ట్ పై ఊదరగొట్టడం సరేసరి. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కల్పించడానికి దిశ చట్టం తీసుకు వచ్చారని నేడో, రేపో అమల్లోకి వస్తుందని ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న సమయంలో, ఇప్పటివరకు దిశ బిల్లు ఆమోదం పొందక పోవడానికి ఏపీ ప్రభుత్వమే కారణమని కేంద్ర స్పష్టం చేసింది.
కేంద్రాన్ని ఇరికించాలని చూసి తామే ఇరుక్కున్న వైసీపీ సర్కార్
కేంద్రం బిల్లును ఆమోదించి చట్ట రూపంలోకి తీసుకు రాలేదని దిశా బిల్లు వ్యవహారంలో కేంద్రాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేయగా, అసలు తప్పంతా మీ దగ్గరే ఉందని కేంద్ర లిఖితపూర్వకంగానే చెప్పింది. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది ఏపీ ప్రభుత్వం. వైసీపీ పార్లమెంట్ సాక్షిగా సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఇక దిశా బిల్లు విషయంలో హడావిడి చేసి, ఇప్పటివరకు కేంద్రం అడిగిన అభ్యంతరాలపై సమాధానం పంపించకుండా తాత్సారం చేస్తున్న ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. జగన్ సర్కార్ చేస్తున్న హడావిడి ఉత్తుత్తి హడావుడేనా అని ప్రశ్నిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా దిశా బిల్లు రగడ
ఇప్పటికే ఇటీవల తాడేపల్లి లో యువతిపై సామూహిక అత్యాచార ఘటనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై నిత్యం భగ్గుమంటున్న ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని నిప్పులు చెరుగుతున్నారు. మహిళలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏ పాటి రక్షణ కల్పిస్తారో ఇప్పటివరకు దిశ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోవడంలోనే అర్థమవుతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం త్వరితగతిన కేంద్రం అడిగిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చి దిశ బిల్లు ఆమోదం పొందేలా చేయాలని సూచిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలకు పరిమితం చేయకుండా దిశ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.