ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : తాలిబన్ల క్రూర పాలనతోనే భయం, భారత్ అధ్యక్షతన యూఎన్ అత్యవసర భేటీ.. ఉత్కంఠ !!
అమెరికా బలగాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోయిన తాలిబన్లు ఊహించని విధంగా ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని పలాయనం చిత్తగించారు. అధ్యక్ష భవనంలో హల్చల్ చేశారు. దీంతో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్ పై స్పెషల్ ఫోకస్ నెలకొంది.
Recommended Video
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం : శాంతి స్థాపన సాధ్యమేనా? సంయమనం పాటించాలని తాలిబన్లకు యూఎన్ చీఫ్ విజ్ఞప్తి !!
తాలిబన్ల క్రూర పాలన .. ఆఫ్ఘనిస్థాన్ ప్రజల్లో భయం
మొదటి నుండి తాలిబన్ల క్రూర పాలనపై ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భయం ఉంది. ఇక తాజా పరిణామాలతో 1996 నుంచి 2001 మధ్య సాగిన తాలిబన్ల క్రూరపాలన ప్రజలకు కళ్ల ముందు ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం, ఆధునికత మెరుగుపడుతున్న సమయంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు మరోమారు ఆఫ్ఘన్ ప్రజలను కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయి. తాలిబన్ల పాలనలో మహిళలు ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇక మహిళలకు విద్య అందని ద్రాక్షే. ఇదే సమయంలో పాకిస్థాన్ పౌరులంతా సాంప్రదాయ దుస్తులను ధరించాల్సి న పరిస్థితి. మహిళలు, స్థానిక మైనారిటీలు తాలిబన్ల పాలనలో చిత్రవధ అనుభవించారు.
శాంతి స్థాపన చేస్తామని తాలిబన్లు చెప్తున్నా నమ్మని ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు
ప్రస్తుతం స్వేచ్ఛగా జీవిస్తున్న వారికి, మళ్లీ తాలిబన్ల పాలన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రేరేపిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా సాధించిన కాస్త అభివృద్ధి కూడా నాశనం అవుతుందని ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే శాంతిని స్థాపిస్తామని, కొత్త శకాన్ని ప్రారంభిస్తామని తాలిబన్లు చెబుతున్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రం తాలిబన్ల మాటలను నమ్మలేకపోతున్నారు. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు నిరంకుశ తాలిబన్ల పాలన నుండి, తాలిబన్ల చెర నుండి ఆఫ్ఘనిస్థాన్ ని కాపాడాలని, ఆఫ్ఘనిస్తాన్ పౌరుల హక్కులకు భంగం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని వేడుకుంటున్నాయి.
ఈ రోజు భారత్ అధ్యక్షతన అత్యవసర భేటీ నిర్వహించనున్న ఐక్యరాజ్య సమితి
ఇదిలా ఉంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈరోజు అత్యవసర సమావేశాన్ని షెడ్యూల్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబన్ల కారణంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలతో యునైటెడ్ నేషన్స్ అత్యవసర భేటీ నిర్వహించనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం నేడు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు భారత్ అధ్యక్షతన జరగనుంది. ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆఫ్ఘన్ పౌరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి ఈ భేటీకి ద్వారా నిర్ణయించినట్లుగా సమాచారం.
ఆఫ్ఘనిస్థాన్ లో యూఎన్ కార్యాలయం .. శాంతి స్థాపన, సహాయక కార్యాకలాపాల కోసం
ఇదిలా ఉంటే రెండు దశాబ్దాల క్రితం యునైటెడ్ నేషన్స్ ఆఫ్ఘనిస్థాన్లో శాంతి స్థాపన కోసం విస్తృతమైన సహాయక చర్యలను నిర్వహించింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో సైనిక బలగాలను మోహరించి రెండు దశాబ్దాలుగా తాలిబన్లతో పోరాటం చేస్తున్న క్రమంలో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ఘనిస్తాన్లో సుమారు 3వేల మంది ఉద్యోగులను, 720 మంది అంతర్జాతీయ సిబ్బందిని నియమించి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. కాబూల్లో ఉన్న ప్రధాన యుఎన్ మిషన్ను ఆఫ్ఘనిస్తాన్లో యుఎన్ అసిస్టెన్స్ మిషన్ లేదా ఉనామా అని పిలుస్తారు . అమెరికన్ నేతృత్వంలోని దండయాత్ర తరువాత ప్రభుత్వాన్ని సృష్టించడానికి 2002 లో యునైటెడ్ నేషన్స్ దీనిని స్థాపించింది.
యూఎన్ కార్యాలయంపైనా తాలిబన్ల దాడి, నేడు యూఎన్ భేటీలో కీలక నిర్ణయాలు
అయితే యుఎన్ సహాయ కార్యకలాపాలలో జోక్యం చేసుకోబోమని తాలిబన్ ప్రకటించింది. కానీ జూలై 30 న, పశ్చిమ నగరమైన హెరాత్లోని యుఎన్ కార్యాలయంపై తాలిబన్లు దాడి చేశారు. కార్యాలయానికి కాపలాగా ఉన్న స్థానిక భద్రతా అధికారి మరణించారు. ఆ పరిణామాలతో ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్థాన్లోని కార్యాలయం నిర్వహణపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక తాజాగా మిలిటెంట్ ఉద్యమం ద్వారా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో చట్టబద్ధమైన శక్తిగా ప్రకటించుకుంటే ఐక్యరాజ్యసమితి తాలిబన్లను ఎలా పరిగణిస్తుందో తెలియాల్సి ఉంది. 193 సభ్యుల సంస్థలోని అనేక దేశాలు తాలిబాన్ల క్రూరత్వాన్ని ఖండించాయి. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితిపై యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో తాజాగా నిర్వహిస్తున్న అత్యవసర భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.