కోడిగుడ్లు కొంటున్నారా ? అయితే జాగ్రత్త అంటున్న నెల్లూరు వాసులు .. ఎందుకో తెలుసా !!
ప్రతిరోజూ ఒక గుడ్డు తినండి... ఆరోగ్యానికి మంచిది అని దేశవ్యాప్తంగా చాలా కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ గుడ్లు కొనే ముందు ఆలోచించండి, తినేముందు మరోమారు చెక్ చేసుకోండి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వాసులు. నెల్లూరు జిల్లా వాసులు ఎందుకు ఇంతగా కోడి గుడ్ల విషయంలో భయపడుతున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదు.
చుక్కలనంటిన చికెన్ ధరలు.. ఏపీ, తెలంగాణాలలో చికెన్ ధరలకు రెక్కలు రావటానికి రీజన్స్ ఇవే !!
నెల్లూరులో కృత్రిమ కోడిగుడ్ల కలకలం
కాదేదీ కల్తీకి, నకిలీకి అనర్హం అని తేల్చేస్తున్నారు పలువురు అక్రమార్కులు. ఏకంగా కోడిగుడ్లనే కృత్రిమ కోడిగుడ్లను తయారు చేసి మార్కెట్లలో యధేచ్చగా విక్రయిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో ఉన్న ఆండ్రా వారి పల్లె లో ఒక మహిళ కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి వాటిని ఉడకబెట్టండి. ఎంతకీ కోడిగుడ్లు ఉడకకపోవడంతో, అనుమానం వచ్చిన మహిళ, ఇరుగు పొరుగు వారిని పిలిచి ఆ గుడ్డును చూపించింది.
కోడిగుడ్లలో ప్లాస్టిక్ , రబ్బర్ తాలూకు ఆనవాళ్ళు
ఆ గుడ్డును పరిశీలించిన ఇరుగు, పొరుగువారు అది కృత్రిమ కోడి గుడ్డుగా తేల్చారు. రబ్బర్ లాగా సాగుతుండడం, అలాగే అచ్చు కోడి గుడ్డులా ఉన్నప్పటికీ గుడ్డు పైన ఉన్న పెంకులో ప్లాస్టిక్ పదార్థ ఆనవాళ్లు ఉండడంతో స్థానికుల్లో కోడిగుడ్ల పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గుడ్ల వ్యవహారం వ్యాపారులలో సైతం కలకలం రేపుతుంది. నెల్లూరు జిల్లాలో గతంలోనూ ఇదే తరహా కృత్రిమ కోడిగుడ్లు బయటపడ్డాయి. ఇప్పుడు మరోమారు కృత్రిమ కోడిగుడ్లు వెలుగులోకి రావడంతో జిల్లాలో కోడిగుడ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
కృత్రిమ కోడిగుడ్ల నేపధ్యంలో స్థానికుల్లో ఆందోళన .. ఫుడ్ సేఫ్టీ అధికారులకు విజ్ఞప్తి
తెలియకుండా ఎవరైనా వీటిని తింటే ఆరోగ్యం పాడవుతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కృత్రిమ కోడిగుడ్ల అమ్మకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కోడిగుడ్ల విక్రయాలు జరుగుతున్నాయా ? అసలు ఎవరీ కృత్రిమ కోడిగుడ్లను మార్కెట్లోకి తెస్తున్నారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. దీంతో ఇప్పుడు గుడ్లు కొనుగోలు చేయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించి కొనుగోలు చెయ్యాల్సిన పరిస్తితు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు వాసులు. మరికొందరు కొద్ది రోజులు గుడ్లు తినడం మానేస్తే పోలా అని చర్చించుకుంటున్నారు.