టీఆర్ఎస్ నేతల్లో కరోనా నింపిన నైరాశ్యం .. నామినేటెడ్ పోస్టులు ఉన్నట్టా ? లేనట్టా ?
తెలంగాణా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలామంది టీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం అలముకుంది. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కని నేతలకు ప్రాధాన్యత ఇచ్చేలా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది అని భావించి ఎంతో ఆశగా ఎదురుచూసిన గులాబీ నాయకులకు కరోనా లాక్ డౌన్ షాక్ ఇచ్చింది. కరోనాతో తెలంగాణ రాష్ట్రం కుదేలవుతున్నవేళ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఊసే లేకుండాపోయింది.
Nizamabad MLC election : కేసీఆర్ తనయకు ఎన్ని కష్టాలు.. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కవిత ఎదురుచూపులు
నామినేటెడ్ పదవుల కోసం గులాబీ నేతల ఎదురుచూపులు
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. అన్ని ఎన్నికలలోనూ టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.అయితే చాలామంది ఎన్నికల్లో పోటీకి సీటు ఆశించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో అటువంటి వారందరూ నామినేటెడ్ పదవులు వస్తాయని బోలెడు ఆశతో ఎదురు చూశారు. ఇక నామినేటెడ్ పదవుల పందేరంలో కేటీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని,యువతకు మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు.
ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు ... ఆశావహుల నిట్టూర్పులు
మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ కోసం పనిచేసి, ఇప్పటిదాకా పదవులు అనుభవించని యువ నాయకులకు ఈ సారి పెద్దపీట వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 103 కార్పొరేషన్లు ఉండగా అతి తక్కువ సంఖ్యలోనే పదవుల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, టీ ఎస్ ఐ ఐ సి చైర్మన్గా బాలమల్లు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఒంటేరు ప్రతాప్రెడ్డి తదితరులకు నామినేటెడ్ పదవులు దక్కాయి. దీంతో మిగిలిన పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.
కరోనా సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో నీలి నీడలు
కానీ ఇప్పటివరకు నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి కాలేదు.ఇక రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ నామినేటెడ్ పదవుల పై ఇప్పటివరకు సందిగ్ధం వీడకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారు గులాబీ నాయకులు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెల నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకపక్క కరోనా వైరస్ ఉద్ధృతి, మరోపక్క లాక్ డౌన్ కొనసాగింపుతో ఆశావహులు పార్టీ పెద్దలను కలవడం సాధ్యం కాలేదు.కరోనా సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి.
ప్రభుత్వం సంక్షోభంలో ఉంటే పదవుల భర్తీ సాధ్యం కాదనే బాధలో గులాబీ నేతలు
అంతేకాదు ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల ప్రస్తావన తీసుకురావడం కూడా సరైనది కాదని కొందరు ఆశావహులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతోంది. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ అలా దృష్టి సారిస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దీంతో కరోనా వైరస్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఆశావహుల ఆశల మీద నీళ్లు చల్లింది. కరోనా ఎలాంటి పరిస్థితి తీసుకు వచ్చింది అని ఆశావహులు తెగ బాధ పడుతున్నారని సమాచారం.