అమానుషం : మహిళను వివస్త్రను చేసి కళ్ళలో కారం కొట్టి గంట సేపు కర్రలతో దాడి చేస్తూ ఊరేగింపు !!
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళను వివస్త్రను చేసి, కళ్ళల్లో కారం కొట్టి దాడిచేసి ఆమెను ఊరేగించిన ఘటన సంచలనంగా మారింది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించి, నాగరికంగా బ్రతుకుతున్న నేటి రోజుల్లోనూ జరుగుతున్న ఇటువంటి అవాంఛనీయ ఘటనలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి.
ప్రేయసిపై అనుమానంతో పెళ్లి రద్దు ; ఆపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన యువకుడి దారుణం !!
శంకర్ నాయక్ అనే వ్యక్తి హత్యకేసు నిందితురాలిపై దాడి
ఇక ఇంతకీ సూర్యాపేటలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే సూర్యాపేటలోని రాజు నాయక్ తండాలో శంకర్ నాయక్ అనే వ్యక్తి జూన్ 13వ తేదీన హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి శంకర్ నాయక్ హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్ట్ అయ్యారు. పాత కక్షల నేపథ్యంలో ఆమె శంకర్ నాయక్ ను హత్య చేసినట్టు స్థానికంగా చర్చ జరిగింది. అయితే హత్య కేసు నిందితురాలు ఇటీవల బెయిల్ పై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తల దాచుకుంటుంది. ఆమెపై అమానుష దాడి జరిగింది.
ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చి, వివస్త్రను చేసి, కళ్ళలో కారంకొట్టి దాడి చేస్తూ ఊరేగింపు
తాజాగా రాజు నాయక్ తండాకు చెందిన బంధువు ఒకరు శనివారం మృతిచెందడంతో అంత్యక్రియలలో పాల్గొనడానికి గ్రామానికి వచ్చిన మహిళపై శంకర్ నాయక్ బంధువులు దాడికి తెగబడ్డారు. హత్య ఘటన లో అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి తండాకు చేరుకున్న నిందితురాలీని చూసి కోపోద్రిక్తులైన శంకర్ నాయక్ బంధువులు, ఆమెను ఇంట్లో నుండి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం చల్లి , కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. నడిరోడ్డుపై దాదాపు గంట సేపు ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ చూస్తున్నా ఆ దారుణాన్ని అడ్డుకోలేక పోయారు.
దాడి నుండి తప్పించుకుని ఎంపీటీసి ఇంటికి .. మహిళకు రక్షణ కల్పించిన ఎంపీటీసీ
చివరకు వారి నుండి తప్పించుకున్న బాధిత మహిళ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. ఆమెను కాపాడమని ప్రాధేయపడింది. దీంతో ఎంపీటీసీ శాంతాబాయి ఆమెకు బట్టలు ఇచ్చి ఓ గదిలో రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు తండాకు వచ్చి బాధిత మహిళను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ సమయంలోనూ తండాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
బాధిత మహిళ తనపై దాడి చేసిన మహిళలు, పురుషులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి చేసిన వారిలో ఒక మైనర్ బాలిక కూడా ఉందని బాధితురాలు వెల్లడించింది. తనను ఇష్టమొచ్చినట్టు కొట్టారని, వివస్త్రను చేసి హింసిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది సదరు మహిళ. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట గ్రామీణ ఎస్సై లవకుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు .
సభ్యసమాజంలో ఇలాంటి అమానవీయ ఘటనలు ఆందోళనకరం
ఎవరైనా నేరం చేస్తే వారికి శిక్ష పడడానికి కోర్టులు, చట్టాలు ఉన్నాయి. అయితే ఓ హత్య ఘటనలో ప్రతీకారంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబం, ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. ఇలా నేరం చేసిన వారిని శిక్షించాలని ఉన్మాదంతో మరో నేరం చేస్తున్న వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. ఏది ఏమైనప్పటికీ సభ్య సమాజంలో ఇటువంటి ఘటనలు తీవ్ర అభ్యంతరకరం మాత్రమే కాదు, ఆందోళనకరం కూడా..